COVID-19 వ్యాధి తగ్గినా కూడా శరీరంలో వైరస్ ఉండవచ్చు..!!

Lokesh Sharma

ఏ రకమైన వైరస్ బారి నుంచి అయినా కోలుకున్న తర్వాత లేదా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా కూడా ప్రజలు వైరస్ ను ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాప్తి చేయవచ్చు. ఈ విషయాన్ని పిటిఐ ఒక అధ్యయనంలో ఇటీవల పేర్కొంది. ఈ సందర్భంగా యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేష్ శర్మతో WION అనే న్యూస్ ఛానెల్ వారు రోగనిర్ధారణ మరియు నియంత్రణ వ్యూహాలపై చర్చలు జరిపారు.

చర్చలో ముఖ్య విశేషాలు ఇవీ…

Corona Outbreak

WION: శర్మ గారు మీ రెసెర్చ్ గురించి చెప్తారా?

Sharma: మేము వివిధ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లపై పని చేస్తున్నాము. మేము ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లపై దృష్టి సారించాము. కరోనా వ్యాప్తి జరిగినప్పటి నుండి, మా దృష్టి మహమ్మారి కరోనావైరస్ యొక్క క్లినికల్ లక్షణాలు ఎలా ఉంటాయి? రోగులు ఈ వైరస్ లకు ఎలా స్పందిస్తారు? విజువల్ క్లియరెన్స్ అంటే ఏమిటి? ఇటువంటి విషయాలపై మేము పరిశోధన చేస్తున్నాము.

WION: మీ పరిశోధనలో బయటపడిన మూడు ముఖ్యమైన ఫలితాలు ఏమిటి?

Sharma: మొదటిది, కరోనా వైరస్ సోకిన చిన్నవయసు వారిలో కూడా వారికి ఇతర వ్యాధులు లేకపోయినా తేలికపాటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయని మా పరిశోధనలో తెలిసింది. రెండవది, వారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేనప్పటికీ, మరియు వారిలో ఇన్ఫెక్షన్లు లక్షణాల పరంగా తగ్గిన తరువాత కూడా, వారు నిరంతర వైరల్ లోడ్ కలిగి ఉంటారు అంతే కాకుండా వారు ఆ వైరస్ ఇతర వ్యక్తులకు సోకడానికి కారణం అవుతారు.

వేరే అధ్యయనంలో తేలిన మూడవ ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైరస్ సంక్రమించిన చాలా మందికి లక్షణాలు ఉండవు, కానీ ఒకానొక సమయంలో వైరస్ వారిలో ఉంటుంది. ఈ అధ్యయనం కోసం, మేము 16 మంది రోగులను పరీక్షించాము. మేము వందలాది మంది రోగులలో వారి యాంటీబాడీ ప్రతిస్పందనను పరీక్షించాము. మరొక అధ్యయనంలో యాంటీబాడీ పరీక్ష మరింత సున్నితంగా ఉంటుందని మాకు అర్థం అయింది. ఇంకొక చిన్న అధ్యయనంలో చాలా మంది ప్రజలు తేలికపాటి, సీరియస్ కాని లక్షణాలను కలిగి ఉన్నారు.

WION: కరోనా పేషెంట్ లకు చికిత్స అందించే వైద్యులకు, ఇతర సిబ్బందికి సబ్‌క్లినికల్ కరోనా వైరస్ సోకకుండా వారిని ఎలా కాపాడాలి?

Sharma: కరోనా పేషెంట్ ల కోసం హాస్పిటల్ లో పనిచేసే సిబ్బంది అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంటారు.  అలాంటి వారు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా వారు తప్పనిసరిగా N-95 మాస్కులు లేదా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే సూట్‌తో పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిగించే దుస్తులను ఉపయోగించాలి. మేము ఫోన్‌లోనే పేషంట్లతో మాట్లాడి రోగులను నిర్ధారిస్తున్నాము. కాబట్టి ప్రజలకు ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేకపోతే వారు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడాలి మరియు హాస్పిటల్ కి వెళ్ళాలి అనే ఆలోచనని మానుకోవాలి.

WION: కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడం ఎందుకు ఇంత కష్టంగా మారుతోంది?

Sharma: సోషల్ డిస్టెన్స్ ను పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే భారతదేశం ఇప్పటివరకు వైరస్ ను బాగా నియంత్రించగలిగింది. ఎందుకంటే, ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలను నిర్వహించింది. కాబట్టి దీన్ని నియంత్రించడానికి పనిచేసేది పరిమితి మాత్రమే అని నేను అనుకుంటున్నాను (ప్రయాణ మరియు సామాజిక సంబంధాల పరంగా). టీకా వచ్చేవరకు అది మాత్రమే సమర్థవంతమైన మార్గం అని నా అభిప్రాయం.

WION: ఈ పరిస్థితుల్లో మీరు భారతీయులకు ఎటువంటి సందేశం ఇస్తారు?

Sharma: భారతీయులకు నా విజ్ఞప్తి ఒక్కటే ఇంట్లోనే ఉండండి. ఇతరులతో ఎటువంటి సంబంధాలు (సోషలైజేషన్) పెట్టుకోవద్దు. సాంప్రదాయ ఔషధాలను నమ్మకండి, గోమూత్రం తాగితే కరోనా తగ్గుతుంది అనే అపోహలను నమ్మవద్దు. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మీకు ఎటువంటి లక్షణాలు లేకపోతే ఇంట్లోనే ఉండండి. మీలో ఏవైనా లక్షణాలు కనబడితే ముందుగా డాక్టర్ తో ఫోన్లో మాట్లాడండి. డాక్టర్ హాస్పిటల్ కి రమ్మంటే మీరు హాస్పిటల్ కి వస్తున్నట్లుగా వారికి ముందుగా తెలియజేయండి. అలా చేస్తే మీతో ఎలా మసలుకోవాలో వారికి ఒక ఐడియా వస్తుంది. ఈ వైరస్ కొన్ని వారాల్లో నియంత్రించబడితే, అన్నీ బాగుంటాయని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని ఎలా ఎదుర్కోవాలో, ఇంకా ఎటువంటి రీసెర్చ్ అవసరం అనే విషయాలపై ఒక అవగాహనకు రావచ్చు.

Scroll to Top
Scroll to Top